కలం, వెబ్ డెస్క్: ముంబై వేదికగా జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసి టీమ్ ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఒకవైపు ఈ విజయోత్సాహం కొనసాగుతుండగానే, మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఫామ్పై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఫైనల్కు వరుణ్ను పక్కనబెట్టాలని కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వరుణ్కు మద్దతుగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) నిలిచారు. వరుణ్ను పక్కనబెట్టాలన్న వాదనలను సెహ్వాగ్ ఖండించారు.
ఇంగ్లండ్తో జరిగిన సెమీస్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ 42 బంతుల్లోనే 89 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఇషాన్ కిషన్, శివమ్ దూబే కీలక పరుగులు జోడించారు. ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ సెంచరీతో భయపెట్టినప్పటికీ.. బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్తో భారత్ను గెలిపించారు. కాగా ఇదే మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్ల బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసి 64 పరుగులు ఇచ్చాడు. ఇదే వరుణ్పై తీవ్ర విమర్శలకు ప్రధాన కారణం.
అయితే, గత కొన్ని మ్యాచ్లుగా వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన సెహ్వాగ్ (Sehwag).. టోర్నీలో ఇప్పటివరకు 13 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా ఉన్న బౌలర్ను పక్కన పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఓపెనర్ అభిషేక్ శర్మ, వరుణ్కు లింక్ పెట్టారు. అభిషేక్ వరుసగా ఫెయిల్ అవుతున్నా అతడికి అవకాశాలు ఇస్తున్నప్పుడు వరుణ్ను ఎందుకు పక్కనబెడతారని ప్రశ్నించారు. బ్యాటర్కు అవకాశాలు ఇస్తున్నప్పుడు బౌలర్ విషయంలో వేరే నిబంధనలు ఎందుకు అని ప్రశ్నించారు. కోల్కతా, ముంబై పిచ్లు బ్యాటింగ్కు అనుకూలించాయని, అయినా వరుణ్ వికెట్లు తీయగలిగారని గుర్తు చేశారు.
Read Also: యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్కు కేఏ పాల్ సంచలన ఆఫర్
Follow Us On: Sharechat

