కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumakonda)లో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని (PDS Rice) టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలపూర్, గణేష్ నగర్లో టాస్క్ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. దాడుల్లో 62 బస్తాల్లో ఉన్న 31 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1,08,500 ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ కేసులో బండారి రాజ్కుమార్ (30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం, గంగారం గ్రామానికి చెందినవాడని, ప్రస్తుతం హనుమకొండ గోపాలపూర్లోని గణేష్ నగర్లో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో గోపాలపూర్ పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరలకు ఇతరులకు విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు నిందితుడిని తదుపరి చర్యల కోసం కేయూసీ పోలీసులకు అప్పగించారు.

