కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో రోజుకు సుమారు 9 లక్షల మంది కూలీలు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సంఖ్యను తక్షణం 15 లక్షలకు పెంచేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సూచించారు. గ్రామాల్లో పనుల ప్రణాళికను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన అనుమతులు, సాంకేతిక ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి మరిన్ని పనిదినాలు సృష్టించాలనిచెప్పారు. కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను అత్యవసరంగా చెల్లించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1590 కోట్ల మేర బకాయిలు ఉండటం ఆందోళనకరమని, వీటిని క్లియర్ చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ పంచాయతీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ పథకం అమలులో వేగం పెంచాలని మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ లో అధికార పర్యటనలో ఉన్న మంత్రి అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. జిల్లా పరిషత్ సీఈఓలు, DRDOలు, DPOలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వింగ్, మిషన్ భగీరథ అధికారులతో మంత్రి సీతక్క (Seethakka) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !
Follow Us On : WhatsApp

