కలం, నల్లగొండ బ్యూరో : టీచర్లు వేధిస్తున్నారంటూ ఓ ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థి స్కూల్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న దారుణ ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చండూరు (Chandur) మండలానికి చెందిన వేముల వెంకన్న, పద్మ దంపతుల కొడుకు వేముల శివసాయి తిప్పర్తి మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ప్రిన్సిపాల్ సునీత, టీచర్ మల్లయ్య తనను వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తల్లిదండ్రులిద్దరూ స్కూల్కి వెళ్లి తమ కొడుకును ఇబ్బంది పెట్టొద్దంటూ ఉపాధ్యాయులను బ్రతిమిలాడి వచ్చింది.
అయితే రెండు రోజుల క్రితం సదరు విద్యార్థి వేముల శివసాయి బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో శివకుమార్ రెండు కాళ్లు విరగడంతో పాటు తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల నుంచి సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సదరు విద్యార్థిని నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శివసాయి రెండు కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. తన కొడుకు ఆత్మహత్యాయత్నానికి కారణమైన ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయుడు మల్లయ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


