ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు: కొండా సురేఖ, శ్రీధర్ బాబు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో నిర్వహించనున్న సరస్వతీ నది అంత్య పుష్కరాల (Saraswati Antya Pushkaralu)పై సచివాలయంలో మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ అంత్య పుష్కరాలు నిర్వహిస్తోందని మంత్రులు వెల్లడించారు. కాళేశ్వరంలో ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు. ఈ పుష్కరాలకు హాజరయ్యేవారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా విస్తృత ఏర్పాట్లను చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మే 21 వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠం స్వామి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ పుణ్య స్నానం ఆచరించి సరస్వతీ అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈసారి దాదాపు 30 నుండి 40 లక్షల మంది పుష్కరాలకు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలన్నారు.

వివిధ పీఠాధిపతులకు తగు ఏర్పాట్లు చేశాం..

ముఖ్యంగా కాళేశ్వరం ఆలయంలో దర్శనాలు, పుష్కర స్నానాలకు వచ్చే వివిధ పీఠాధిపతులకు తగు ఏర్పాట్లు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పుష్కర ఘాట్ ల వద్ద పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మేడారం జాతర స్పూర్తితో సరస్వతి అంత్య పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రతీ రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజి ఈ పుష్కారాల్లో పాల్గొని పుణ్య స్నానం చేస్తారని, ఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాల అనుభవాలు రానున్న గోదావరి పుష్కరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణా రావు మాట్లాడుతూ.. ఈ అంత్య పుష్కరాలకు విస్తృతమైన మౌలిక సౌకర్యాలు చేశామని వివరించారు. పెద్ద సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే అవకాశమున్నందున శానిటేషన్, ట్రాఫిక్, ప్రోటోకాల్, రవాణా, తాగునీటి సౌకర్యం తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.. 2012 లో జరిగిన సరస్వతి పుష్కరాలకు కేవలం 2 లక్షల మంది మాత్రమే హాజరవగా, గత సంవత్సరం జరిగిన ఆది పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది హాజరయ్యారని వెల్లడించారు. ఈ అంత్య పుష్కరాలలో ప్రతి రోజు హోమాలు, ఘాట్ వద్ద హారతి, సాంసృతిక కార్యక్రమాలు, తెప్పోత్సవం నిర్వహణతో పాటు పెద్ద పిండ ప్రదానాలు జరుగుతాయని చెప్పారు. మొదటి రోజు కంచి స్వామిజీతోపాటు రాష్ట్ర గవర్నర్ కూడా పుణ్య స్నాలకు హాజరవుతారని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>