కలం, వెబ్ డెస్క్ : డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆదివారం డీఎస్సీ అభ్యర్థుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ బాధితులకు వైసీపీ పూర్తిగా అండగా ఉంటుందని, తమ అధినేత జగన్ ఇప్పటికే అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం న్యాయం చేయకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులను సరిదిద్దుతామన్నారు. తాము అధికారంలోకి వస్తే డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీఎస్సీ స్కామ్ పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించిన ఆయన.. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి తప్పు ఒప్పుకుని ఈ స్కామ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముందుస్తు కుట్రతోనే డీఎస్సీ స్కామ్ జరిగిందని సజ్జల సంచలన ఆరోపణ చేశారు. అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. డీఎస్సీ స్కామ్పై చివరివరకు వైసీపీ పోరాడుతుందని చెప్పారు.

