కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ (RTC) ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించి, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రధాన డిమాండ్లు, సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా.మేడిపల్లి సత్యం, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మిక పక్షపాత ప్రభుత్వం మాది..
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. గత పాలకులు మాటలకే పరిమితమైతే, మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతలతో చరిత్ర సృష్టించిందన్నారు. ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ, సంఘాల ఎన్నికలకు అనుమతులన్నీ కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం అని వివరించారు. దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కిందని, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆర్టీసీ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.

