కలం, కరీంనగర్ బ్యూరో: రైతులు పండించిన పంటను దళారులకు అమ్మి నష్టపోకుండా… ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కరీంనగర్ (Karimnagar) మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) రైతులకు సూచించారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, పలువురు కార్పొరేటర్లు, రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. అనంతరం ధాన్యం రాశులకు పూజలు నిర్వహించి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడతూ… మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తూకం విషయంలోనూ, గన్నీ బ్యాగుల లభ్యతలోనూ ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలన్నారు, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నగదును వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారుల విక్రయించి నష్టపోకూడదని సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి, ఎండబెట్టిన ధాన్యాన్ని వ్యవసాయ కేంద్రాల్లో విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంపెల్లి శ్వేత రమన్, సోమిడి వేణు, అధికారులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

