కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డుపై తరచుగా రోడ్డు ప్రమాదాల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డి.జానకి, శుక్రవారం ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేశారు. అనంతరం పోలీసు అధికారులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. రహదారిపై ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లు అమర్చడం, వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు లాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

