కలం, వెబ్ డెస్క్ : విజయనగరం (Vizianagaram) జిల్లా పేరాపురం జాతీయ రహదారి నెత్తురోడింది. అతివేగంతో వచ్చిన ఒక కారు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన వాహనం తొలుత రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఆపై వేగంగా వెళ్లి నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు.
మృతుల్లో విశాఖపట్నానికి చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. మిగిలిన ముగ్గురు మృతులు పాదచారులుగా గుర్తించారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ దామోదర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన ఆయన ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం మహారాజా ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ఈ ఘోరానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

