కలం, వెబ్ డెస్క్ : నేడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలు రాయి. సీఎం చంద్రబాబు (CM Chandrababu) నవ్యాంధ్రప్రదేశ్లో భారీ టెక్ విప్లవానికి నాంది పలుకుతున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భాగంగా నెలకొల్పనున్న గూగుల్ ఎఐ డేటా సెంటర్ ను నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయన్నారు. ఉదయం 9.30కి శంకుస్థాపన చేయనున్న ఈ డేటా సెంటర్ కార్యక్రమానికి గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ , పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారు.
గూగుల్ ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్డీఐ) ఒకటిగా నిలవనుంది. సుమారు 600 ఎకరాల్లో.. అంటే అదవివరం, తార్లువాడ, రాంబిల్లి ప్రాంతాల్లో దీని నిర్మాణం జరుగుతుంది. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ ఏఐ డేటా సెంటర్ భారతదేశంలో మొదటి గిగావాట్ స్థాయి ఏఐ హబ్ గా నిలవనుంది.
కాగా, ఇది కేవలం ఒక డేటా సెంటర్ కాదు, ఆసియా ఖండానికే కీలకమైన ఏఐ గేట్వేగా విశాఖను మార్చబోయే ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో అంతర్జాతీయ టెక్నాలజీ పటంలో విశాఖ నగరానికి శాశ్వత స్థానం లభించనుంది. దీనిద్వారా పోర్టు నగరంగా ప్రసిద్ధి చెందిన విశాఖ, ఇకపై “డేటా సిటీ”గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ఈ సంస్థ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ ఎఐ డేటా సెంటర్ రాకతో టెక్ హబ్గా ఏపీ మారనుంది.

