కలం, వెబ్ డెస్క్: దేశంలోని ప్రధాన నగరాల్లో వీధి కుక్కల (Stray Dogs) దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. దీనివల్ల అనేకమంది తీవ్రంగా గాయపడుతున్నారు. చనిపోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వందలాది మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల పాలవుతుండగా, చిన్నారులు, వృద్ధులపై ఈ దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రరూపం దాల్చుతోంది. గత మూడు నెలల కాలంలోనే ఏకంగా 31 కుక్కకాటు ఘటనలు నమోదు కావడం కలకలం రేపుతోంది. బాధితులలో అత్యధికంగా 24 మంది విమానాశ్రయ సిబ్బంది ఉండటం గమనార్హం. ఈ దాడులకు సంబంధించిన భయంకరమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమై, ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఎక్కడైనా కుక్కలు గుంపులుగా ఉన్నా, ప్రమాదకరంగా కనిపిస్తున్నా వెంటనే అక్కడి భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. స్థానిక అధికారులు నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారడం లేదని సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: తెలుగులో ఆశా భోస్లే పాడిన ఈ పాట చాలా ఫేమస్ తెలుసా?
Follow Us On : WhatsApp

