కలం, వెబ్ డెస్క్: మహాభారతంలోని రెండు పాత్రలంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. కర్ణుడు, బార్బరికుడు ఈ రెండు పాత్రలు తనకు ఆదర్శమని చెప్పుకొచ్చారు. కర్ణుడి పాత్ర నుంచి మిత్రధర్మం, బార్బరికుడి పాత్ర నుంచి బలహీనుల పక్షాన నిలబడటం అనే లక్షణాలను తాను అలవర్చుకున్నానని చెప్పారు. ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా తాను మిత్రధర్మానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం శిల్పకళావేదికలో నిర్వహించిన తెలంగాణ మాదిగ ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ ధన్యవాద కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహాభారతాన్ని ప్రస్తావించారు. మాదిగ సోదరులకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. వారి మద్దతులోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కట్టుతప్పుతోందని తెలిపారు. దాన్ని సరిచేస్తామన్నారు.
పేదలకు పంచేందుకు భూములు లేవు
మాదిగ సోదరులకు ఇతర పేదలకు పంచేందుకు ప్రభుత్వం దగ్గర భూములు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. అందుకే వారికి మెరుగైన విద్యను అందిస్తామని చెప్పారు. చదువు చెప్పడం ద్వారా చైతన్యం నింపుతామన్నారు. విద్యాశాఖ తన దగ్గరే ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యమన్నారు. పల్లెటూర్లలో విద్యాలయాలు ఉన్నప్పటికీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో నాణ్యమైన భోజనం పెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: చివరి దశకు ఆపరేషన్ కగార్: నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అర్బన్ నక్సల్స్!!
Follow Us On: Facebook

