కలం, వెబ్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మార్చి 8న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు(T20 World Cup Final)లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, పటిష్టమైన న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి చరిత్రను తిరగరాయాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.
హోస్ట్ సెంటిమెంట్
టీ 20 ప్రపంచకప్ చరిత్రను గమనిస్తే ఆతిథ్య దేశాలకు ఒక విచిత్రమైన రికార్డు ఉంది. గత 19 ఏళ్లలో, అంటే 2007 నుండి ఇప్పటి వరకు జరిగిన ఏ ఎడిషన్లోనూ ఆతిథ్య దేశం తన సొంత గడ్డపై ఛాంపియన్గా నిలవలేదు. గతంలో 2012లో శ్రీలంక, 2016లో భారత్ తమ దేశాల్లో ఫేవరెట్లుగా బరిలోకి దిగినప్పటికీ సెమీస్ లేదా ఫైనల్ దశల్లోనే వెనుదిరిగాయి. ప్రస్తుతం శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇస్తున్న భారత్, ఫైనల్లో కివీస్ను ఓడించి ఈ ‘హోస్ట్ సెంటిమెంట్’ను బ్రేక్ చేసిన తొలి దేశంగా నిలవాలని భావిస్తోంది.
హెడ్-టు-హెడ్ రికార్డులు
ఐసీసీ మెగా టోర్నమెంట్లలో న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ భారత్కు కఠిన సవాల్గా మారుతోంది. గత టీ20 ప్రపంచకప్ల గణాంకాలను పరిశీలిస్తే, ఇరు జట్లు ముఖాముఖి తలపడిన మూడు సందర్భాల్లోనూ న్యూజిలాండే విజయం సాధించి 3-0 ఆధిక్యంలో ఉంది. అంతేకాకుండా 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి కీలక నాకౌట్ మ్యాచుల్లోనూ కివీస్ భారత్ను దెబ్బకొట్టింది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 4-1తో న్యూజిలాండ్ను చిత్తు చేయడం టీమ్ ఇండియాకు అతిపెద్ద సానుకూల అంశం.
ఈ టోర్నీలో ఎవరెలా ఆడారంటే
ప్రస్తుత ప్రపంచకప్లో ఇరు జట్లు అసాధారణ ఫామ్లో ఉన్నాయి. భారత్ తరపున సంజూ శాంసన్ 232 పరుగులతో టాప్ స్కోరర్గా ఉండగా, సెమీస్లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు ఊపిరిపోసింది. బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి 12 వికెట్లతో రాణిస్తుండగా, జస్ప్రీత్ బుమ్రా తన ఎకనామికల్ స్పెల్స్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 289 పరుగులతో భీకర ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా సెమీస్లో అతను సాధించిన సెంచరీ భారత్కు హెచ్చరికలా మారింది. మిచెల్ సాంట్నర్ స్పిన్ మ్యాజిక్ కివీస్కు ప్రధాన బలంగా ఉంది.
ఫైనల్పై అంచనాలు
అహ్మదాబాద్లోని లక్షకు పైగా ప్రేక్షకుల మద్దతు భారత్కు అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఒకవైపు వరుసగా రెండోసారి ప్రపంచకప్ నెగ్గి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని భారత్ చూస్తుంటే, మరోవైపు ఒక్కసారి కూడా టీ20 ట్రోఫీ గెలవని కివీస్ ఈసారి ఎలాగైనా కప్పు పట్టాలని పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంతో ఉన్నాయి. కాబట్టి, ఫైనల్ (T20 World Cup Final) రోజున ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకుని నిలబడే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. రికార్డులు ఏవైనా, ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు హోరాహోరీగా సాగడం ఖాయం. చరిత్రను తిరగరాసి భారత్ విజేతగా నిలుస్తుందో లేదో తెలియాలంటే మార్చి 8వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
Read Also: వైట్హౌస్లో మెస్సీ సందడి.. ట్రంప్ చేతుల ట్రోఫీ
Follow Us On : WhatsApp

