సర్పంచ్లుగా మంచోళ్లను ఎన్నుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్దికి సహకరించే లీడర్లను ఎన్నుకోవాలని సూచించారు. ఖమ్మం జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తోందని చెప్పారు. ముఖ్యమైన శాఖలు మొత్తం ఈ జిల్లా నుంచే ఉన్నాయని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా మంత్రులు అనుకుంటే సాధ్యం కానిది అంటూ లేదంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కీలక మంత్రులంతా ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి ప్రభుత్వానికి అండగా నిలబడిందని చెప్పారు.
కొత్తగూడెం(Kothagudem) థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందలాది ఎకరాలను ఆనాడు రైతుల ఇచ్చారు.. కాని ఉద్యోగాలు మాత్రం ఇతర ప్రాంతాల వారు పొందారని గుర్తు చేశారు. తొలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పాల్వంచ నుంచే మొదలైందని గుర్తు చేశారు. పదేళ్లు ప్రధానమంత్రిగా మన్మోహాన్ సింగ్ సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారన్నారు. దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ప్రపంచంతో పోటీ పడాలని తొలి ప్రధాని నెహ్రు ఎడ్యూకేషన్ పాలసీని తీసుకొచ్చారని గుర్తు చేశారు. నెహ్రూ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులతోనే దేశం కళకళలాడుతోందని చెప్పారు. నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులతో దేశాన్ని నెహ్రూ సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన ప్రాజెక్టులతో కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసింది తప్ప.. బీడు భూములకు నీరు అందలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు.
‘విద్య మాత్రమే తెలంగాణను ఉన్నతస్థానంలో నిలబెడుతుంది. అందుకే ఆ వైపు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సింగరేణి లాంటి సంస్థలను పెంచాలంటే ఎర్త్ యూనివర్సిటీ లాంటివి అవసరమని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పొలాల్లో పారించి సిరులు కురిపించాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని చెప్పుకొచ్చాు.
రేషన్ కార్డుల పంపిణి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు.. ఏ కార్యక్రమైనా ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించామనీ జిల్లాకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలిపారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లా అభివ్రుద్ది బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో రాజకీయ కక్షలు మాని పదేళ్లు అండగా నిలబడాలన్నారు. ‘గ్రామాల్లో సర్పంచ్లు మంచోళ్లు ఉండాలి.. మంత్రులతో కలిసి పనిచేసే వాళ్లు కావాలి.. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి మంచి నేతలను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్.. చిక్కులన్నీ క్లియర్
Follow Us On: instagram


