కలం, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో అమెరికాలోని డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఇరువురు నేతలు చర్చించారు.
డెలావర్ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణం, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలను మాట్ మేయర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. వీటితో పాటు డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి అంశాలపై కూడా ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా రూపొందించిన ‘తెలంగాణ-2047 విజన్ డాక్యుమెంట్’ను సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ మాట్ మేయర్కు అందజేశారు.
భవిష్యత్తులో తెలంగాణ, డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన సత్సంబంధాలు కొనసాగాలని మాట్ మేయర్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి తమ రాష్ట్రానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని ఆయన ఆహ్వానించారు.

