కలం, కరీంనగర్: ఆ భార్యాభర్తల బంధాన్ని మరణం కూడా వేరు చేయలేకపోయింది. భర్త చనిపోయిన గంటల వ్యవధిలోనే మరణంలోనూ నీ తోడుగా వస్తానంటూ భార్య తుది శ్వాస విడిచింది. ఈ విషాదకర సంఘటన చొప్పదండి (Choppadandi) మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పొన్నాల లచ్చయ్య(85) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన భార్య హనుమమ్మ(80) కూడా అనారోగ్యంతో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో లచ్చయ్య ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం చనిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమమ్మ భర్త మరణ వార్త తెలుసుకొని తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త చనిపోయాడన్న ఆవేదనతో రాత్రి 10 గంటల ప్రాంతంలో హనుమమ్మ కూడా తుది శ్వాస విడిచింది. గంటల వ్యవధిలోనే వృద్ధ దంపతులు చనిపోవడంతో వారి కుటుంబం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

