కలం, వెబ్ డెస్క్ : ఇటీవల లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారి వేధింపులు తాళలేక పలువురు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. దీంతో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా కొత్త డ్రాఫ్ట్ రూల్స్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిబంధనలను మీరితే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ హెచ్చరించింది. రికవరీ పేరుతో వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది.
ఈఎంఐలతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లు కొనుగోలు చేసిన వారు రెండు నెలలు లోన్ కట్టకపోయినా డివైజ్ లను బ్లాక్ చేయకూడదని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది. 90 రోజులు దాటినా స్పందించకపోతే ఫోన్ ఫీచర్లను (ఎమర్జెన్సీ సర్వీసులు మినహా) నిలిపివేయవచ్చని తెలిపింది. బకాయి చెల్లించిన గంటలోపు లాక్ తొలగించాలని, లేదంటే గంటకు రూ. 250 చొప్పున కస్టమర్ కి ఇవ్వాలని ఆదేశించింది. అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అయితే పలు ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఈ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చింది. స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు ఈ కొత్త నిబంధనల నుంచి మినహాయింపులు ఉంటుందని పేర్కొంది.

