కలం, ఖమ్మం బ్యూరో: అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని, ఈ వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే అటవీ సరిహద్దులను కొలిచి తేల్చాలని అధికారులను ఆదేశించామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. మిగిలిన రెవెన్యూ భూమిలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. గురువారం సత్తుపల్లిలోని ఎంఆర్ గార్డెన్స్ లో స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో పెనుబల్లి, వేంసూరు, సత్తుపల్లి మండలాలకు సంబంధించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – ప్రజా దర్బార్’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. వందలాదిగా తరలివచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించి, గత ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్ తో రైతాంగం ఇబ్బందులు..
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గడీల పెత్తనంలో బందీ అయిన భూ రికార్డులను విడిపించి, భూములపై పేదలకే సర్వాధికారాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి పట్టణ పరిధిలోని 399 సర్వే నంబర్ అంశంతో పాటు, చుట్టుపక్కల 9 గ్రామాల్లో ఉన్న దాదాపు 6,500 ఎకరాల భూ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా పేదపల్లి, నారాయణపురం పరిసరాల్లోని 5,500 ఎకరాల పైచిలుకు భూములను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కొలతలు చేపట్టి, స్వాధీనంలో ఉన్న అర్హులైన రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, పహానీలలో వారి పేర్లు ఎక్కించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రుద్రాక్షపల్లి, కొకపాడు, తాళపెంట, రామచంద్రాపురం, వెంకటగిరి సహా సరిహద్దుల్లోని 10-12 గ్రామాల్లో అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు పొందిన రైతులు సాగు కోసం బోర్లు వేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు ఎక్కడా అభ్యంతరాలు పెట్టవద్దని.. జిల్లా అదనపు కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్లు ఈ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్..
ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలకులు అడ్డగోలుగా రూ.8 లక్షల 18 వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. అయినప్పటికీ అప్పులు ఉన్నాయని నెపంతో తాము చేతులు ముడుచుకుని కూర్చోలేదని, ఉన్న వనరులతోనే పేదవాడికి భద్రత, భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. గత పాలకుల కాలంలో ఎన్నికలు రాగానే ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బొమ్మలు చూపించి ఒట్టి కాగితాలకే పరిమితం చేశారని, ఆ ‘బొమ్మల ఇళ్ల’ నాటకాలకు తమ ప్రభుత్వం చెక్ పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పటికే 1.25 లక్షల ఇళ్లు పూర్తి కాగా, జూన్ నాటికి మరో లక్ష ఇళ్లు సిద్ధమవుతాయని వెల్లడించారు. వచ్చే జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ఘనంగా ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రకటించారు.
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు..
హైదరాబాద్లో బటన్ నొక్కితే ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే ప్రతి సోమవారం నిధులు జమ చేస్తున్నామని, ఇళ్లు కట్టుకునే పేదలకు ములకలపల్లి క్వారీ నుంచి నాణ్యమైన ఇసుకను ఉచితంగా అందిస్తామని చెప్పారు. పాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధుల బకాయిలు, ఇతర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ఒకట్రెండు రోజుల్లోనే ఫలితాలు వస్తాయన్నారు. గత పాలకుల హయాంలో నిరుద్యోగులను రోడ్డున పడేస్తే.. తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే 72,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని, త్వరలోనే మరో కొత్త కొలువుల ప్రకటన రాబోతుందని మంత్రి స్పష్టం చేశారు.

