సాఫ్ట్‌వేర్ కన్నా స్కిల్స్‌కే ఎక్కువ జీతం : సీఎం కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తొలిసారిగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాల పెంపును పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. దీనివల్ల దాదాపు కోటి 11 లక్షల మంది కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వెంకటస్వామి కుమారుడే ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారని, కార్మికులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే డే రోజునే ఈ విషయాన్ని ప్రకటించాలనుకున్నప్పటికీ, క్యాబినెట్ సబ్ కమిటీ చర్చల కారణంగా కొంత ఆలస్యమైందని వివరించారు. కొత్త పరిశ్రమలను స్థాపించే సమయాల్లోనే కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాలకు ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తృతి పెరగడం వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతోందని సీఎం హెచ్చరించారు. ఈ తరుణంలో బ్లూ కాలర్ ఉద్యోగాలకు భారీగా అవకాశాలు పెరుగుతున్నాయని, యువత తమ దృష్టిని సాఫ్ట్‌వేర్ రంగం నుండి సాంకేతిక నైపుణ్యాల వైపు మళ్లించాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో లక్ష రూపాయల వేతనం లభిస్తే, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి రెండు లక్షల వరకు లభించే అవకాశం ఉందని ఉదాహరించారు. సింగపూర్, జర్మనీ వంటి దేశాల పర్యటనల్లో అక్కడి ప్రతినిధులతో జరిపిన చర్చల ఆధారంగా ఈ విషయాలను గ్రహించినట్లు చెప్పారు. కొరియా, తైవాన్, చైనా వంటి దేశాలు ఇంగ్లీష్ రాకపోయినా కేవలం ఉత్పత్తి రంగంపై ఆధారపడి అమెరికా కంటే మెరుగ్గా అభివృద్ధి చెందాయని గుర్తుచేశారు. ఐఫోన్ వంటి పెద్ద బ్రాండ్లు అమెరికావి అయినప్పటికీ, వాటి ఉత్పత్తి అంతా ఈ ఆసియా దేశాల్లోనే జరుగుతోందని వివరించారు.

యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్లుగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందుకోవడానికి వీలుగా యువతకు జపనీస్, జర్మన్, కొరియన్ వంటి విదేశీ భాషలను నేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు (స్కిల్స్) నేర్చుకుంటే వంద శాతం బ్లూ కాలర్ ఉద్యోగాలు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. ఏ చదువు చదివినా చివరికి ఉద్యోగమో, ఉపాధి మార్గమో లభించినప్పుడే దానికి సార్థకత ఉంటుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>