కలం, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కవిత (Kavitha) పార్టీ ప్రకటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దీన్ దయాల్ ప్రశిక్షణ్ అభియాన్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయని, చాలా మంది పార్టీలు పెడుతున్నారని రాంచందర్రావు అన్నారు. ఇప్పుడు కూడా ఒకరు పార్టీ పెట్టినట్లు ఉన్నారని పరోక్షంగా కవిత పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీ చేసుకునేందుకే పార్టీ పెట్టినట్లు ఉన్నారంటూ సెటైర్లు వేశారు. అయితే పార్టీ పెట్టడం పెద్ద విషయం కాదని, ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుందనే విషయం ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తోందని వెల్లడించారు. 12 సంవత్సరాల మోదీ పాలనలో ఒక్క అవినీతి సంఘటన కూడా జరగలేదన్నారు.
తెలంగాణలో గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్లు ఉన్నాయని, ఇప్పుడు వాటికి పుట్టబోయే బిడ్డ కూడా టీఆర్ఎస్ అని వ్యాఖ్యానించారు. వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం మంత్రులంతా సగం జీతాలు ఇస్తారని చెప్తున్నారని, ఇలా ఎన్ని రోజులు ఇస్తారని ప్రశ్నించారు. జీతాలు కాదు కానీ మీరు దోచుకున్నవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కేంద్ర పార్టీకి ఇస్తామన్న 5 వేల కోట్ల నుంచి 500 కోట్లు తెలంగాణ ప్రజలకు ఇవ్వాలన్నారు. అవినీతి రహిత పాలనకు తెలంగాణ ప్రజల ముందున్న ప్రత్యామ్నాయం బీజేపీయే అని రాంచందర్రావు (Ramchander Rao) స్పష్టం చేశారు.
Read Also: కవిత కొత్త పార్టీపై ఎంపీ చామల రియాక్షన్
Follow Us On: Instagram

