కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ – అమెరికా యుద్ధంను ఆసరాగా చేసుకుని పొరుగు దేశాలు భారత దేశంపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని చెప్పారు. కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడారు. ఉగ్ర చర్యలపై గతంలో భారత్ దీటుగా బదులిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పహల్గాం దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న వేళ రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే.. భారత దళాలు పాకిస్తాన్ ఎన్నటికీ మరిచిపోని విధంగా సమాధానం ఇస్తాయన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సాయుధ దళాలు పాకిస్తాన్ ను 22 నిమిషాల్లో మోకరిల్లేలా చేశాయని గుర్తు చేశారు. భారత సైనిక చరిత్రలో ఉగ్రవాదంపై చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ అని వెల్లడించారు. గడిచిన 11 ఏళ్లలో మోడీ జాతీయ భద్రతను బలోపేతం చేశారన్నారు.

