కలం, వెబ్ డెస్క్: లోక్సభలో ప్రతిపక్ష నేతగా తాను బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రజల గొంతుకగా మారి సమస్యలను పార్లమెంట్ వేదికగా వినిపించినట్లు వెల్లడించారు. నీట్ రద్దు, ఎన్నికల బాండ్లలో అవినీతి బయటకు తీయడం, రాజ్యాంగంపై దాడి.. ఇలా ప్రతీ అంశంలో పోరాటం చేసినట్లు వివరించారు. తనపై ప్రజలు నమ్మకం ఉంచడమే అతి పెద్ద బలమన్నారు. ఈ ప్రయాణం చాలా సుదీర్ఘమైందని.. ఎదురయ్యే ప్రతి యుద్ధంలో పోరాడటమే తనకు తెలుసన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
42 డిబేట్లలో ప్రసంగం..
ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ 42 సార్లు పార్లమెంటులో జరిగిన ప్రత్యేక డిబేట్లలో ప్రసంగించారు. 25 రాష్ట్రాల్లో 297 సార్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేసినట్లు వివరించారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సమర్థవంతంగా బాధ్యతలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాని అయ్యే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకున్నారంటూ కొనియాడారు.

