కలం, వెబ్డెస్క్: థాయ్లాండ్ ఓపెన్ (Thailand Open)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)కు నిరాశ ఎదురైంది. బ్యాంకాక్లో జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ టాప్ సీడ్ అకానే యమగుచి (Akane Yamaguchi)తో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ఓటమిపాలైంది. తొలి గేమ్ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ, ఆ తర్వాత పుంజుకున్న యమగుచి 19-21, 21-18, 21-15 తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకుంది. గంటకు పైగా సాగిన ఈ పోరులో సింధు చివరివరకు గట్టి పోటీ ఇచ్చినా విజయం మాత్రం అందుకోలేకపోయింది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు, ఈ సూపర్ 500 టోర్నీలో ఆరో సీడ్గా బరిలోకి దిగింది.
అంతకుముందు ప్రిక్వార్టర్స్లో డెన్మార్క్కు చెందిన అమాలీ షుల్జ్ను వరుస గేమ్స్లో ఓడించి క్వార్టర్స్కు చేరుకుంది. అయితే ప్రపంచ నంబర్-3 యమగుచి ఎదుట ఆమె పోరాటం అక్కడితో ముగిసింది. ఇక పురుషుల విభాగంలో భారత ఆశలు కొనసాగుతున్నాయి. వరల్డ్ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్తో పాటు స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లో బరిలోకి దిగనున్నారు.

