కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ లోని పీఎంజే జ్యువెలరీ షాపు (PMJ Jewelry shop)లో జరిగిన భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మహారాష్ట్రకు చెందిన ప్రమాదకరమైన ‘పర్లీ గ్యాంగ్ (Purly Gang)’ ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్లోని కొన్ని కుటుంబాలకు దొంగతనాలు చేయడం అనేది తరతరాలుగా వస్తున్న అలవాటుగా సమాచారం. ఇటువంటి భారీ దోపిడీలు చేయడంలో సుశిక్షితులని, గంజాయి సేవించి టార్గెట్ను కచ్చితంగా కొట్టడంలో వీరు ఆరితేరిన వారని తెలుస్తోంది. వీరి వద్ద విదేశీ ఆయుధాలు సైతం ఉండే అవకాశం ఉందని సమాచారం. దొంగలు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవడానికి అత్యంత హైటెక్ పద్ధతులను వాడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా దొంగలు బైకులపై వెళ్తారని పోలీసులు భావిస్తారు. కానీ ఈ ముఠా తమ బైకులను (అపాచీ, పల్సర్ వంటివి) కంటైనర్లు , హైటెక్ బస్సుల్లోని లగేజీ కంపార్ట్మెంట్లలో దాచి పెడతారని సమాచారం.
బైకుల టైర్లలో గాలి తీసేసి బస్సుల్లో ఎక్కించడం, చెక్ పోస్టులు దాటిన తర్వాత మళ్లీ గాలి కొట్టి వాటిపై ప్రయాణించడం వీరి స్టైల్ అని తెలుస్తోంది. ఆదివారం దోపిడీ తర్వాత వీరు బావుపేట నుండి మల్యాల మీదుగా జిల్లా సరిహద్దులు దాటి ఉండవచ్చని అంచనా. వేములవాడ లేదా జగిత్యాల హైవేపై భారీ వాహనాల్లో వీరు పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మొబైల్ టవర్ల ఆధారంగా ఆ ప్రాంతంలోని అనుమానిత ఫోన్ నంబర్లను గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే కొన్ని ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ అవ్వడంతో, అవే దొంగల నంబర్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ నంబర్ల ద్వారా ‘సస్పెక్టెడ్ కాంటాక్ట్ లిస్ట్’ తయారు చేసి అనలైజ్ చేస్తున్నారు.ప్రస్తుతానికి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారన్న వార్తలను ఖండించినప్పటికీ, ముఠా గుట్టు కనిపెట్టేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read Also: స్టాలిన్ ఓటమి.. సీఎం పదవికి రాజీనామా!
Follow Us On : WhatsApp

