కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ

కలం, నల్లగొండ బ్యూరో: భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి (Anil Kumar Reddy)కి నిరసన సెగ తగిలింది. భువనగిరి జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సులో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు ఎమ్మెల్యేను నిలదీశారు. తమ గ్రామాలకు నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు.

తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని బీఆర్ఎస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సు జరుగుతుండగానే సర్పంచులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభా ప్రాంగణంలో గందరగోళం నెలకొంది. సమస్యలపై ప్రశ్నిస్తున్న సర్పంచులకు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రజాప్రతినిధుల మధ్య మాటల యుద్ధం జరగడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రగతి ప్రణాళికపై అవగాహన కల్పించాల్సిన సదస్సు, రాజకీయ విమర్శలు, నిరసనల మధ్య సాగింది. మరోవైపు ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో యాదాద్రి భువనగిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఇదిలావుంటే.. అవగాహన సదస్సులో రభస జరగడంతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar Reddy) మధ్యలోనే వెళ్లిపోయారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>