కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా (Medak) మాసాయిపేట సమీపంలో నేషనల్ హైవే 44 పై ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్కు చెందిన ఈ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్కు వచ్చి, మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో నుంచి డ్రైవర్ , క్లీనర్ బయటకు దూకేశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో చోటు చేసుకోంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.

