కలం, వెబ్ డెస్క్ : సమాజంలో ఎన్ని చట్టాలు వచ్చినా, అవగాహన కార్యక్రమాలు చేపట్టినా వరకట్న వేధింపులు ఆగడం లేదు. తాజాగా కర్ణాటకలోని రామనగర (Ramanagara) ప్రాంతంలో అదనపు కట్నం వేధింపులకు గురై ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 11 నెలల క్రితం నయన (20)కు నాగరాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే, ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త నాగరాజుతో పాటు అత్తింటివారు నయనను వేధించడం మొదలుపెట్టారు. ఈ చిత్రహింసలను తట్టుకోలేక ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అయినప్పటికీ, భార్యపై ప్రేమ నటించిన నాగరాజు, ఇకపై తనను బాగా చూసుకుంటానని నమ్మబలికి ఆమెను తిరిగి కాపురానికి తీసుకువచ్చాడు. నయన ఐదు నెలల గర్భిణీ అన్న విషయాన్ని కూడా విస్మరించి, కొన్ని రోజుల వ్యవధిలోనే అత్తింటివారు మళ్లీ వేధింపులకు దిగారు. దీంతో నయన తీవ్ర మనస్థాపంతో తనకు తానే నిప్పు అంటించుకుంది.
తీవ్ర గాయాలైన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులైన భర్త నాగరాజు, అత్తింటివారిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

