కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలో నీట్ (NEET) ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని భాగ్య శ్రీ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తరచూ సామాజిక అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించే పూనమ్ నేడు నీట్ విద్యార్థిని ఆత్మహత్యపై స్పందిస్తూ మనం వంతారాలోని జంతువులనే రక్షిద్దాం కానీ, బెంగళూరులో నీట్ విద్యార్థిని భాగ్య శ్రీ గురించి మాత్రం మాట్లాడొద్దని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. సమాజంలో మూగజీవాల సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత, తోటి మనుషుల ప్రాణాల పట్ల చూపించకపోవడంపై ఆమె ఈ విధంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే పోస్ట్లో పూనమ్ కౌర్ భిన్నమైన యువత.. భిన్నమైన ఆకాంక్షలు అంటూ సరికొత్త విశ్లేషణ చేశారు. చదువుల్లో ఎంతో ప్రతిభ కనబరిచి, దేశ భవిష్యత్తుగా మారాల్సిన యువత ఇలా పరీక్షల ఒత్తిడికి బలైపోతుంటే సమాజం స్పందిస్తున్న తీరును ఆమె ప్రశ్నించారు. యువత ఆశయాలు, వారిపై ఉండే ఒత్తిడిని అర్థం చేసుకోవడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయనే కోణంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. యువత ఇలాంటి వాటిపై ఎక్కువగా స్పందించాలని, ప్రభత్వాలను నిలదీయాలని పూనమ్ కౌర్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

