ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై మోడీకి చెప్పండి.. చంద్రబాబుకు పొన్నం లేఖ

కలం, కరీంనగర్ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై మోడీకి చెప్పాలని లేఖలో కోరారు. “ఉమ్మడి ఏపీ సీఎంగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష మీకు తెలియంది కాదు. మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ నాయకులొక‌వైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవు. భారత్-పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మే విధంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలింది అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయి. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే! అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పండి. ఇవన్నిటికీ మూలం బీజేపీ సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలే అనుకుంటాను. ‘రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టార’ని ఒకమారు, ‘బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపార’ని మరొకమారు ఆయన అనుచితంగా మాట్లాడారు. ‘ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని బహుషా ప్రధాని మోదీకి తెలియదేమో! మీరు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పండి” అని లేఖలో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>