కలం, వెబ్ డెస్క్: మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కరీంనగర్లో బుధవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులు, విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వం మహిళలు, విద్యార్థులకు అందిస్తున్న పథకాలను వివరించారు. వాగేశ్వరి ఇంజినీరింగ్ కాలేజీ నుండి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ఈ ప్రయాణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పొన్నం వెంట ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ విద్యార్థుల కోసం కాలేజీలు, స్కూళ్ల సమయానికి అదనపు బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.
మహా లక్ష్మీ పథకం తరువాత పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త బస్సులు కొనుగోలు చేశామన్నారు. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉండాలని, వారికి అసౌకర్యాలు కలిగించొద్దని కండక్టర్, డ్రైవర్లకు సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందని మంత్రి తెలిపారు. ఎన్నికలు పూర్తి కాగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీనం ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని పొన్నం మండిపడ్డారు.

