కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడ లేనివిధంగా ఈవీ పాలసీని తీసుకువచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈవీ పాలసీలో భాగంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిందన్నారు. ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ టైంలో సున్నా ట్యాక్స్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో అర్బన్ ఆక్సిజన్ పార్క్ లో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి పొన్నం మొక్కలు నాటారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు దగ్గర మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. మొక్కలు నాటడానికి అన్ని గ్రామాల్లో ఐదుగురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. ప్రజలందరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని పొన్నం సూచించారు.

