కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి మా అయ్య జాగీరేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పొన్నం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణలోని 4 కోట్ల మంది జాగీరేనని పవన్ కల్యాణ్కు గట్టిగా బదులిచ్చారు.
ఇక్కడ నవనిర్మాణం అంటే ఊరుకోం..
పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో తిరగొచ్చని.. సినిమా నటుడిగా ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చని పొన్నం (Ponnam Prabhakar) పేర్కొన్నారు. కానీ నవ నిర్మాణం చేస్తా అంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారని.. ఆయన గౌరవించామని చెప్పారు. పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టులో పర్యటిస్తే ఆయనకు స్వాగతం పలికామని చెప్పారు. ప్రొటోకాల్ పాటించామన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం రోజు ఇక్కడికి వచ్చి చిచ్చు పెడతామంటే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు.
కొండగట్టుకు ఇచ్చింది ఎవరబ్బ సొమ్ము?
పవన్ కల్యాణ్ పదే పదే తాను కొండగట్టుకు సాయం చేశానని చెప్పుకుంటున్నారని.. అసలు ఎవరబ్బ సొమ్ము ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా తన జేబులో నుంచి డబ్బులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పెయిడ్ అర్టిస్ట్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన వెనుక బీజేపీ లేదా బీఆర్ఎస్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటే బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్కు తెలంగాణపై ఇంత అక్కసు ఎందుకని నిలదీశారు? తాము ఎవరినీ అవమానించడం లేదన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా? పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. గద్దర్ గురించి పవన్ కల్యాణ్ ఇష్టారాజ్యంగా మాట్లాడారని పొన్నం ఫైర్ అయ్యారు.

