కలం, వెబ్ డెస్క్: వెలుగుమట్ల బాధితులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. నిజమైన బాధితులకు త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అక్కడ మొత్తం 410 మంది బాధితులు ఉన్నారని, మరో 330 మంది బోగస్గా తేలినట్లు తెలిపారు. నిజమైన బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ప్రభుత్వమే ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి అవసరమైన మొత్తం ఇస్తుందని స్పష్టం చేశారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు.
బీఆర్ఎస్ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్రంగా స్పందించారు. ఓఆర్ఆర్ పక్కన ఉన్న క్రషర్తో తనకు ఏ సంబంధం లేదని.. బీఆర్ఎస్ నేతలవి తప్పుడు ఆరోపణలి పేర్కొన్నారు. సంబంధం లేని క్రషర్ను తనదిగా పేర్కొంటూ కొందరు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మొరిగే వారిని ఏ గొలుసుతో కట్టేయాలో తనకు తెలుసని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆ క్రషర్ తనది కాదని, క్రషర్ నడిపే ఓపిక కూడా తనకు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చెబుతున్నది తిరుమల క్రషర్ కంపెనీకి చెందినదని తెలిపారు. వేస్ట్ క్రష్ చేసి సరఫరా చేసే లైసెన్స్ ఆ కంపెనీకి ఉందని చెప్పారు. ఆ కంపెనీ తమ కంటైనర్ను తీసుకెళ్లిందని, దానిపై ఉన్న పేరును తొలగించినట్లు కనిపిస్తోందని అన్నారు. అదే అంశాన్ని పట్టుకుని కొందరు చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

