కలం, వెబ్ డెస్క్: గుంటూరు (Guntur) జిల్లాలో టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) నేతల మధ్య రాజకీయ పోరు ఉద్రిక్తంగా మారుతోంది. మీడియా ముందు విమర్శల నుంచి కర్రలు, రాడ్డులతో పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. తాజాగా పొన్నూరులో మరోసారి ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరు వర్గాల మధ్య దాడులు జరుగగా పలువురు వైసీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్క రోజు వ్యవధిలోనే రెండో సారి ఘర్షణలు జరుగడం గమనార్హం. 13వ వార్డుకు చెందిన వైసీపీ కార్యకర్తలు మండ్రు మనోహర్, వెంకటరత్నం జేమ్స్లకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. తమపై దాడి చేసిన వారు పొన్నురు టీడీపీ ఎమ్మెల్యేకు అనుచరులే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బాణాల భవాని శంకర్, పెద్ద బాణాలు అనే టీడీపీ నేతలు తమను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసులు కూడా తమ ఫిర్యాదులపై సరిగ్గా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.

