కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడింది. ఆటోలో తరలిస్తున్న సుమారు రూ.14.45 లక్షల విలువైన 28.9 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఆటో, గంజాయి సీజ్..
పోలీసుల వివరాల ప్రకారం.. పాల్వంచ పట్టణ పరిధిలోని సంజయ్నగర్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేయగా, గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రియదర్శిని కాలనీకి చెందిన ఉప్పుగుండ్ల ప్రభాకర్ దీన్ని రవాణా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.34 వేల నగదు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, ఆటోను సీజ్ చేశారు.
ఒడిశా నుంచి రవాణా..
ఒడిశా నుంచి గంజాయిని అక్రమంగా జిల్లాకు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభాకర్తో పాటు ప్రమేయం ఉన్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

