కలం, ఖమ్మం బ్యూరో: డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంతలా ఉపయోగపడుతుందో, అంతే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయని సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ పేర్కొన్నారు. విద్యార్థులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం సత్తుపల్లిలోని సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో ఎన్సీసీ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ ఫణిందర్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ఎంచుకుంటున్న వివిధ రకాల మోసాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఆఫర్ల పేరిట మోసాలు
ముఖ్యంగా ఐపీఎల్ టికెట్ బుకింగ్ ఫ్రాడ్, కొరియర్ స్కామ్, ఆన్లైన్ బుకింగ్, డెలివరీ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్ ఆఫర్ల పేరిట జరిగే మోసాల గురించి వివరించారు. అలాగే దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న లోన్ యాప్ వేధింపులు, బ్లాక్మెయిల్స్, డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ మోసాలు, ఏపీకే ఫైల్ ఫ్రాడ్స్, బెట్టింగ్ యాప్ల వెనుక ఉన్న ప్రమాదాలను ఆయన ఉదాహరణలతో సహా వివరించారు.
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయండి
ఎవరైనా దురదృష్టవశాత్తూ సైబర్ నేరానికి గురై ఆర్థికంగా నష్టపోతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. లేదంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదనీ సూచించారు. బ్యాంక్ ఓటీపీలను వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దనీ డీఎస్పీ పనీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ 11(T) బెటాలియన్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర, లెఫ్టినెంట్ కల్నల్ విజయ్ కుమార్, పంకజ్ ధోరన్, కాలేజీ ప్రిన్సిపల్ శ్రీమతి శేష సాయి తో పాటు దాదాపు 500 మంది ఎన్సిసి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

