కలం/ఖమ్మం బ్యూరో : భద్రాచలంలో (Bhadrachalam) ఈ నెల 27న నిర్వహించబోయే సీతారామచంద్రస్వామి కళ్యాణానికి పోచంపల్లి చేనేత పట్టు వస్త్రాల తయారీకీ ఈవో కే.దామోదర్ రావు గురువారం శ్రీకారం చుట్టారు. సీతారామ, లక్ష్మణ, హనుమంతుల వారికి మగ్గంపై పట్టు వస్త్రాలను నేసే అవకాశాన్ని హైద్రాబాద్ కు చెందిన భక్త బృందం దక్కించుకుంది. వీరు భద్రాచలంలోనే వారం పాటు ఉండి రామనామం జపిస్తూ వస్త్రాలను తయారు చేస్తారు. ప్రధానంగా సీతమ్మవారి పట్టుచీర జాకెట్, రామయ్యకు పంచ కండువా.. లక్ష్మణుడు, హనుమంతుడికి పంచ కండువా నేస్తారని ఆలయ అధికారులు వెల్లడించారు.
భద్రాచలంలోని (Bhadrachalam) రంగనాయకుల గుట్టపైనున్న ధ్యాన మందిరంలో మగ్గం ద్వారా పది మంది నిపుణులు వారం పాటు పంచరంగుల వస్త్రాలను తయారు చేస్తారు. సికింద్రాబాద్ గణేష్ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎస్ ఎస్ జయరాజ్ పది మంది బృందానికి నేతృత్వం వహించడం గమనార్హం.

