కలం, వెబ్డెస్క్: ‘రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలున్నారు. ప్రజల్లో ఆదరణ ఉంది. అయినా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగానూ ఎదగలేకపోతున్నాం. కారణాలేంటి? రాష్ట్రంలో పార్టీ ఎందుకు వెనకబడింది? ’ అంటూ తెలంగాణ బీజేపీ ఎంపీల పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలు వీడి, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్లోని 15 మంది బీజేపీ ఎంపీలకు గురువారం ప్రధాని మోదీ బ్రేక్ ఫాస్ట్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితిని సమీక్షించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. రాష్ట్రంలో పార్టీ వెనకబాటుపై ఎంపీలకు ప్రధాని మోదీ సీరియస్ క్లాస్ తీసుకున్నారు. ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, ఎనిమిది మందిని ఎంపీలుగా గెలిపించారని, అయినా కనీసం ప్రధాన ప్రతిపక్షంగానూ ఎందుకు ఎదగలేకపోతున్నామని ప్రశ్నించారు. ఈ మేరకు ఆధారాలతో సహా ప్రశ్నిస్తూ, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్ని అవకాశాలూ ఉన్నా రాష్ట్రంలో ఎదగలేకపోతున్నామని, ఎంపీల నిర్లక్ష్యంపై ప్రధాని మోదీ (PM Modi) సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎందుకు గట్టిగా నిలయదీయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా పనితీరుపైనా ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా కంటే తెలంగాణ బీజేపీ వెనకబడిందని వ్యాఖ్యానించారు. ఇకనైనా విబేధాలు వీడి, ఉమ్మడిగా పనిచేయాలని తెలంగాణ బీజేపీ ఎంపీలకు హితవు పలికారు. సమస్యలపై ప్రశ్నిస్తూ, పర్యటిస్తూ రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేందుకు కృషి చేయాలని సూచించారు.
Read Also: ఇంటెలిజెన్స్ ప్రభాకర్రావుకు పోలీస్ కస్టడీ
Follow Us On: Pinterest


