కలం, వెబ్డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరో విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ముందు ఈ నెల 29, 30న ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ను సందర్శించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు శవ్కత్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, ఇంధన రంగాలతో పాటు సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. అలాగే తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని, తాష్కెంట్ యూనివర్సిటీలోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని ప్రధాని సందర్శించనున్నారు.
ఉజ్బెకిస్తా పర్యటన అనంతరం మోదీ కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కేక్కు వెళ్లనున్నారు. అక్కడ జరిగి షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రాంతీయ భద్రత, ఉమ్మడి అవకాశాలపై భారతదేశ ప్రాధాన్యతలను వివరిస్తారు. ఈ సదస్సు విరామ సమయంలో మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా మధ్య ఆసియా సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన ఆరో వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవంలోనూ మోదీ పాల్గొంటారు.

