కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) పుసర్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఈ వేడుకలకు బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం సువేందు అధికారి సైతం హాజరయ్యారు. ప్రజలు భారీ ఎత్తున హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లాహిరి మహాశయుల వంటి మహానుభావులు నడయాడిన బెంగాల్ ఆధ్యాత్మిక భూమిపై యోగా వేడుకలు జరుపుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. యోగా డే వేడుకల కోసం బెంగాల్ ప్రజలు చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు యోగా చక్కని పరిష్కారాలను చూపుతుందని మోదీ తెలిపారు. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్రం వరకు యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని మోదీ హర్షం వ్యక్తం చేశారు. యోగాతో దేశ వ్యాప్తంగా చైతన్యం నిండిపోయిందని, వయసుతో పాటు ఆరోగ్యానికి యోగా చాలా మంచిదని చెప్పారు. యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని వెల్లడించారు. ఫిజికల్ ఫిట్ నెస్ కు, ఎమోషనల్ బ్యాలెన్స్కు, ప్రశాంతతకు ఇది అద్భుతంగా పని చేస్తుందని చెప్పారు. ప్రతి రోజు యోగా చేసి 30 ఏళ్ల వయస్సులో ఉన్న దాని కంటే 50 ఏళ్ల వయస్సులో మరింత ఉత్సాహంగా ఉండండి అని మోదీ తన సందేశంలో పిలుపునిచ్చారు. యోగాను కేవలం ఏడాదికి ఒకసారి జరుపుకునే కార్యక్రమంగా కాకుండా, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఆయన సూచించారు.

