కలం, వెబ్ డెస్క్ : భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి రేటును సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల పట్టుదల, శ్రమశక్తికి ఇది నిదర్శనమని, దేశ ప్రజలందరికీ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అలజడులు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, కోవిడ్ తదుపరి కాలం నుంచి తీవ్ర అస్థిరత నెలకొన్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని ఆయన తెలిపారు. దేశంలో కొంతమంది తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయి అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నప్పటికీ, దేశం అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతోందని కొనియాడారు.
ఈ వేగాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) దిశగా అడుగులు వేయాలని ప్రధాని (PM Modi) పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని పాటించడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు. కేవలం వినోదం కోసం విదేశీ ప్రయాణాలు చేయడం, విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం మాని, ‘వెడ్డింగ్స్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించాలని ప్రజలను కోరారు.
అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని సూచించారు. 140 కోట్ల మంది భారతీయుల ఐక్యతతో 100 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాల నాటికి యువతకు ‘వికసిత్ భారత్(Viksit Bharat)’ను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Also Read : ఇన్స్టా గ్రాఫ్పైనే.. పొలిటికల్ ఫ్యూచర్!
Also Read : సికింద్రాబాద్ రెజిమెంట్లో ఆయుధాలు మాయం!
Follow Us On : WhatsApp

