కలం, ఖమ్మం బ్యూరో: పినపాక నియోజకవర్గంలో వివిధ పనుల మంజూరు కోరుతూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (Payam Venkateswarlu) మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించారు. గిరిజన ప్రాంతాల రహదారులు, వంతెనల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కోరారు.
మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం, పినపాక, అల్లపల్లి, గుండాల మండలాల పరిధిలో రూ. 37.35 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 15 బీటీ రోడ్లు, హై లెవల్ బ్రిడ్జిల ప్రతిపాదనలు సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మణుగూరు ఆసుపత్రి పడకల పెంపుపై..
మణుగూరు ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న 100 పడకలను 150 పడకలుగా అప్గ్రేడ్ చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. అటవీ ప్రాంతమైన గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా మార్చాలని విజ్ఞప్తి చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు. స్పందించిన మంత్రి, ఆసుపత్రుల అప్గ్రేడేషన్ ప్రతిపాదనలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

