కలం, వెబ్ డెస్క్: తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కెప్టెన్సీలో పెషావర్ జల్మీ (Peshawar Zalmi) ఎట్టకేలకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11 ట్రోఫీని ముద్దాడింది. 2017లో తొలిసారి టైటిల్ గెలిచిన జల్మీ, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్లో పెషావర్ జల్మీ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ప్రత్యర్థి నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.3 ఓవర్లలోనే ఛేదించారు. ఈ విజయంలో ఆరోన్ హార్డీ అజేయ హాఫ్ సెంచరీతో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అబ్దుల్ సమద్, హార్డీ మధ్య నెలకొన్న 85 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పింది. సమద్ 34 బంతుల్లోనే 48 పరుగులు చేసి జల్మీ విజయాన్ని సులభతరం చేశారు. జట్టు విజయంపై ఆల్ రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ గెలుపు క్రెడిట్ మొత్తం టీమ్ మేనేజ్మెంట్, యజమానులకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. జట్టులో (Peshawar Zalmi) సరైన ఆటగాళ్లను ఎంపిక చేసి, మంచి కాంబినేషన్ను సెట్ చేసిన విధానాన్ని ఆయన అభినందించారు. 2017లో తాము టైటిల్ గెలిచినప్పుడు కూడా జట్టు బలంగా ఉండేదని, కానీ ఈసారి అంతకంటే మెరుగైన సమతుల్యతతో కూడిన జట్టును నిర్మించారని కొనియాడారు. జట్టులో నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు, పటిష్టమైన మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్తో పాటు మంచి ఫినిషర్లు ఉండటం వల్లే చాంపియన్స్ కాగలిగామని ఇఫ్తికార్ వివరించారు. అన్ని విభాగాల్లోనూ ఆటగాళ్లు రాణించడం వల్లే విజయం సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. బాబర్ ఆజం కెప్టెన్సీలో జట్టు సాధించిన ఈ విజయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On: Sharechat

