కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజా గొంతుక మూగబోయింది. ప్రముఖ ప్రజా కళాకారుడు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు అరుణోదయ నాగన్న (Arunodaya Naganna) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాగన్న మృతితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
నాలుగు దశాబ్దాలుగా..
తిరుమలాయపాలెం మండలం రాజారాం గ్రామానికి చెందిన నాగన్న, దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా అణగారిన వర్గాల గొంతుకగా మారి, ఆటపాటలతో విప్లవ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. పీడిత ప్రజల పక్షాన నిలబడి, భూమి, భుక్తి, విముక్తి కోరుతూ సాగిన అనేక ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు. గంభీరమైన గొంతు, చైతన్యవంతమైన పాటలతో సాగిన ఆయన పోరాట ప్రస్థానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
అన్ని వర్గాల సంతాపం..
నాగన్న హఠాన్మరణంపై వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, కవులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదని, నాగన్న మృతి ప్రజా బాటలో పూడ్చలేని లోటని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సంతాపాన్ని ప్రకటించారు.

