కలం, కరీంనగర్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్ కనెక్టెవిటీ విస్తరిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతంచేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పొన్నం తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పొన్నం పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. బస్ డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ
గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పొన్నం పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కూడా కొనసాగుతోందని, ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

