కలం, ఖమ్మం బ్యూరో: ఇళ్లు, పాఠశాలల నుంచే పరిశుభ్రత ప్రారంభం కావాలని, మూలస్థాయిలోనే వ్యర్థాలను వేరు చేయడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోగలమని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పంచాయతీ అధికారి బి. అనూష పిలుపునిచ్చారు. ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గురుకుల పాఠశాలలో గురువారం చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డీపీఓ అనూష మాట్లాడుతూ.. వ్యర్థాల నిర్వహణ ప్రకారం నాలుగు రకాల వ్యర్థాలను వేరు వేరుగా సేకరించడంపై సమగ్ర అవగాహన కల్పించారు. చెత్తను తడి, పొడి, ఇతర వర్గాలుగా ప్రారంభంలోనే వేరు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సుస్థిరత సాధ్యమవుతుందని వివరించారు.
ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, తమ ఇళ్లలో, ప్రాంగణాల్లో చెత్త నిర్వహణపై ఇతరులకు కూడా చైతన్యం తేవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు, పాల్వంచ మండల పరిషత్ అధికారి, పంచాయతీ కార్యదర్శి, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

