కలం, వెబ్ డెస్క్: వైసీపీని ఎదుర్కొనేందుకు కూటమి నేతలంతా ఐకమత్యంగా ఉండాలని, అంతా చంద్రబాబుకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోరారు. అసెంబ్లీ వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YSRCP) ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నా 11 వందల మంది ఉన్నట్లు మాట్లాడుతారని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా వాళ్లు చెప్పేవి బలంగా నమ్ముతారన్నారు. ప్రభుత్వం చేసే పనులు చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు.
వైసీపీ వాళ్లను ఎదుర్కోవాలంటే కూటమి సభ్యులు ఏకాభిప్రాయంతో ఉండాలని పవన్ కోరారు. వైసీపీ వాళ్లే తిట్టి, ఎదుటి వాళ్లు తిట్టినట్లు ప్రచారం చేస్తారని, వాళ్లే దాడి చేసి వాళ్లపైనే దాడి జరిగినట్లు గగ్గోలు పెడతారని విమర్శించారు. కూటమిలో పార్టీలు వేరువేరు సమూహాల నుంచి వచ్చాయని, మరో 15 ఏళ్లు రాష్ట్రం కోసం కలిసి పాటుపడదామని పవన్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పని చేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు తాను ఎంతో కష్టపడినట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. రాష్ట్రం బాగుండాలంటే కూటమి ఇలాగే కొనసాగాలని కోరారు.

