కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం అని పేర్కొన్నారు. 2024 ఏపీ ఎన్నికల్లో ప్రజలు అహంకారాన్ని, దౌర్జన్యాన్ని తిరస్కరించారన్నారు. కూటమి ఏర్పాటులో జనసేన 21 సీట్లతో రాజీపడలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన త్యాగం చేస్తే .. ప్రజలు తమకు 100 శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కంటే ఎవరూ పెద్ద కాదన్న పవన్ కళ్యాణ్.. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి, కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ”ఏపీ పునర్నిర్మాణం కోసం ఏర్పడిన కూటమి ఇది.. ప్రజలు అధికారం కాదు.. బాధ్యత ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తోందని వెల్లడించారు.
‘తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా’!
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రం కుల రాజకీయాలను అధిగమించాలని, మరో రాష్ట్రం ప్రాంతీయత పరిమితులను దాటాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు వీటిని వీడి భారతీయత వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలు బలహీనప్పుడు కులం, ప్రాంతీయత వంటి అంశాలు ముందుకు వస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు ప్రజలు పార్టీలకు కాకుండా వ్యవస్థలను నమ్మాలన్న పవన్ కళ్యాణ్.. నాయకులను కాకుండా సంస్థలను విశ్వసించాలన్నారు. వ్యక్తులను కాకుండా విలువలను ఆదర్శంగా తీసుకోవాలని .. అప్పుడే ప్రజాస్వామ్యం, గ్రామ స్వరాజ్యం సాకారం అవుతాయని వివరించారు.

