కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో కల్తీ నెయ్యి అంశంపై నేడు ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పవన్ అన్నారు. దీనిపై తాను దీక్ష చేసినట్లు గుర్తు చేశారు. ఎన్డీడీబీ నివేదికలో కూడా తిరుమల లడ్డూలో జంతు కొవ్వు ఉందని వెల్లడైందని స్పష్టం చేశారు. ఇక మరో నివేదికలో రసాయనాలు ఉన్నట్లు తేలిందని, ఈ రసాయనాల్లో ఇంకా ఏమేమున్నాయో దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు.
ఈ లడ్డూలో కల్తీ నెయ్యి అంశంతో ఎవరు లబ్ధి పొందుతారని పవన్ ప్రశ్నించారు. ఇదే హిందూ మతంలో కాకుండా వేరే ఎవరికి జరిగినా ప్రపంచమంతా గగ్గోలు పెట్టేవారని పవన్ అన్నారు. అలాగే గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేను ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ టీటీడీ బోర్డు చేసిన తప్పేనన్నారు. టీటీడీ బోర్డులోని వారిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్లాన్ ప్రకారమే కుట్ర జరిగిందని సిట్ తేల్చినట్లు తెలిపారు.

